హైదరాబాద్:
అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ వెళ్లే మెట్రోను అక్టోబర్లో ప్రారంభిస్తామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ అమీర్పేట్- ఎల్బీనగర్ వరకు మెట్రో ఎలక్ట్రిసిటీ టెస్ట్ రన్ జరుగుతోందన్నారు. జూలై చివరి నాటికి ట్రయల్ రన్ పూర్తి చేసి ఆగస్ట్లో మెట్రో ప్రారంభిస్తామని తెలిపారు. మెట్రో రైలులో రోజుకు 80 వేల మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ మెట్రోను గూగుల్కు అనుసంధానం చేయబోతున్నట్లు తెలియజేశారు. జేబీఎస్- ఎంజీబీఎస్ వరకు మెట్రోను 2019 మార్చిలోగా పూర్తిచేస్తామని చెప్పుకొచ్చారు. అలాగే పాతబస్తీలో మెట్రో ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.
మెట్రో రెండో దశలో భాగంగా ఎయిర్పోర్టు వరకు అన్ని ప్రాంతాల నుంచి అనుసంధానం చేస్తామని స్పష్టం చేశారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ మీదుగా ఫలక్నుమా వరకు మెట్రో నడిపిస్తామన్నారు. మెట్రో పిల్లర్లకు యూనిక్ నెంబరింగ్ ఇస్తామని చెప్పారు. కారిడార్ 1కి A నెంబర్, కారిడార్ 2కు B, కారిడార్ 3కి C నెంబర్ కేటాయిస్తామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు